కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్లో భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు పెట్టే సమయంలో అసలు స్థానంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలను ఉంచి అప్రయిజర్ మోసాలకు పాల్పడినట్లు తేలింది. ముందుస్తు ప్రణాళికలో తనకు తెలిసిన వారి చేత బ్యాంకులలో ఖాతాలు తెరిపించాడు అప్రయిజర్. వారికి తెలియకుండా వారి ఖాతాల పేర్లతో రోల్డ్ గోల్డ్ పెట్టి అసలు బంగారంగా రికార్డుల్లో రాశాడు. రుణాల రూపంలో భారీగా డబ్బులు దోచుకున్నాడు.
దాదాపు 500 మంది ఖాతాదారుల పేరుతో రోల్డ్గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్ లక్షల్లో బ్యాంక్కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.