టీడీపీకి అతిపెద్ద షాక్ తగిలింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా సైకిల్ చైన్ తెంపేశారు. నిన్నమొన్నటివరకు చంద్రబాబుకు అండదండలు అందిస్తూ టీడీపీ కోర్ టీమ్లో కీలక సభ్యులుగా ఉన్న లీడర్లంతా బీజేపీ గూటికి చేరారు. పార్టీ మారడమే కాదు ఏకంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్నే బీజేపీలో విలీనంచేసి బాబుకి బిగ్ షాకిచ్చారు.
బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనమైంది. చంద్రబాబుకి షాకిచ్చిన నలుగురు ఎంపీలు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డా, బీజేపీ రాజ్యసభాపక్ష నేత గెహ్లాట్తో కలిసి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుతో సమావేశమైన సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ఆ మేరకు లేఖ అందజేశారు. 10వ షెడ్యూల్ నాల్గో పేరా ప్రకారం టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని కోరారు. ఇకపై తమకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదన్న సుజనా, సీఎం రమేష్, టీజీలు బీజేపీ ఎంపీలుగా గుర్తించాలన్నారు.
అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో సుజనా, సీఎం రమేష్, టీజీలు కాషాయ కండువా కప్పుకున్నారు. మోడీ, అమిత్షా నాయకత్వం నచ్చి ఏపీ మరియు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరినట్లు ప్రకటించారు.
టీడీపీలో సంక్షోభంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీశారు. యూరప్ టూర్ నుంచి సీనియర్ లీడర్లతో ఫోన్లో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కొత్తేమీ కాదన్న బాబు టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తాను కేంద్రంతో పారాడానని, కానీ బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
రాజ్యసభలో తెలుగుదేశం దాదాపు ఖాళీ కావడంతో టీడీపీ లోక్సభ ఎంపీల దారెటనే చర్చ జరుగుతోంది. టీడీపీకి లోక్సభలో ముగ్గురు ఎంపీలు ఉండగా వీళ్లు కూడా చంద్రబాబుకి షాకిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు లోక్సభ స్పీకర్ను కలవడం కలకలం రేపుతోంది.