తన సస్పెండ్ ను సవాల్ చేస్తూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్సెన్షన్ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిరాధరమైన ఆరోపణలతో తనను సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. గత ఏడాది మే 31 నుంచి తనకు వేతనం చెల్లించడంలేదని ఏబీ వెంకటేశ్వర్లు పిటిషన్ లో గుర్తు చేశారు.
ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేసింది. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తెలిపారు. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించింది. సస్పెన్షన్కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన పనిచేశారు.