Posani Krishna Murali: సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజాలోని అపార్ట్ మెంట్స్ లో ఉండగా పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన క్రిమినల్ కేసు నెంబర్ 65/2025 కింద పోసానిపై కేసు నమోదు అయ్యింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 196, 353(2)111, అలాగే BNS చట్టం 3(5)కింద పోసానిపై అభియోగాలు మోపారు.
ఈ కేసును పోలీసులు కోగ్నిజబుల్,నాన్ బెయిలబుల్ అని పేర్కొన్నారు. గురువారం ఉదయం అతన్ని ఒబులవారిపల్లెకు తరలించినట్లు సమాచారం. తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోసాని వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో వ్యవహరిస్తూ పోలీసులకు ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నించడంతో అతని అదుపులోకి తీసుకోవడం కష్టంగా మారింది.
ఇప్పటికే రాజకీయాల నుంచి పూర్తి విరమించుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతను గతంలో చేసిన పలు రాజకీయ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అనంతపురం జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. గతంలో కూడా పోసానిపై పలు పీఎస్ లలో కేసులను మోదు అయ్యాయి.