ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. లోకల్ వార్కు పార్టీలన్నీ సై అంటున్నాయి. దీని కోసం కేడర్ను అన్ని పార్టీలూ సిద్ధం చేశాయి. ఏపీలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యాయి. మూడు దశల్లో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించనున్నారు.
ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది, ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు 9 వేల 984 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 24న జరగనుంది. ఈనెల 30వ తేదీన పరోక్ష పద్ధతిలో జడ్పీఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది.