కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల స్థలాల విషయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన అధికారులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కొత్తూరులో వ్యవసాయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అధికారులు అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తహసీల్దార్ వనజాక్షి రాగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు తీసుకునేందుకు వీల్లేదని వనజాక్షితో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల సాయంతో తహసీల్దార్ అక్కడి నుంచి వెనుదిరిగారు.