పిన్నెల్లి అరెస్టుకు ఈసీ ఆదేశాలు.. హైదరాబాద్కు పోలీసు బృందాలు
పిన్నెల్లి అరెస్టుకు ఈసీ ఆదేశాలు.. హైదరాబాద్కు పోలీసు బృందాలు
Election Commission: మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సీఈవోకు సీఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనపై సీఈవోను వివరణ కోరింది. కేసు నమోదు చేసి వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి.
పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 9 చోట్ల, ఇందులో ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టాం. ఏడేళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన్ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు అని ఎంకే మీనా తెలిపారు.