డాక్టర్ సుధాకర్ డిశ్చార్జి.. హైకోర్టు తీర్పును అమలు చేసిన వైద్యులు
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర సంచలనమైన ఘటన తెలిసిందే.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర సంచలనమైన ఘటన తెలిసిందే. తనను పిచ్చివానిగా చిత్రీకరించి, అవసరం లేని మందులు ఇస్తున్నారని, దీని వల్ల భవిషత్తులో ఇబ్బందులు పడతానని సుధాకర్ నేరుగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, తాజాగా తనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటూ ఆయన తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాను సారం ఆయన్ను డిశ్చార్జి చేశారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విశాఖ గవర్నమెంట్ మెంటల్ ఆసుపత్రి నుంచి నుంచి వైద్యుడు సుధాకర్ డిశ్చార్జ్ అయ్యారు. కోర్టు తీర్పుల కాపీలను హాస్పిటల్ అధికారులకు అందించిన సుధాకర్ తల్లి కావేరి బాయి, బంధువు విజయ్కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితలు..ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. సుధాకర్కు కొన్నాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందించనున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు.
డాక్టర్ సుధాకర్ ను గత నెల 16న గవర్నమెంట్ మెంటల్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. కాగా తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలిపి, వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ సుధాకర్ తల్లి హైకోర్టులో గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన ఉన్నత న్యాయస్థానం..సూపరెండెంట్ అనుమతితో సుధాకర్ను డిశ్చార్జ్ చెయ్యాలని ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణలో సహకరించాలని సుధాకర్ కు సూచించింది.