బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను రూపం – దక్షిణ కోస్తాకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ తుపానుకు యెమన్ దేశం ‘దిత్వాహ్’ అని పేరు పెట్టింది.
బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను రూపం – దక్షిణ కోస్తాకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ తుపానుకు యెమన్ దేశం ‘దిత్వాహ్’ అని పేరు పెట్టింది. గత ఆరు గంటల్లో ఈ తుపాను గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపుగా కదులుతోంది.
ప్రస్తుతం దిత్వాహ్ తుపాను శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, పుదుచ్చేరిలోకి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయ దిశగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను వచ్చే ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉండాలని, రైతులు పంటలను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.