ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్పై వివాదం కొనసాగుతోంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ల్యాండింగ్ సమస్య ఉందంటూ అధికారులు సమాచారం అందించారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శనివారం కూడా నంద్యాలలో వర్షాలపై ఎరియల్ సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ఇవాళ కూడా అదే సమస్య వచ్చిందంటూ అధికారులు వెల్లడించడంతో జగన్ మండిపడ్డారు. అందుకే జగన్ హైదరాబాద్కు ఆలస్యంగా వస్తున్నారు. ముందు అనుకున్న ప్రకారం ఈ మధ్యాహ్నమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాబ్లమ్తో సమావేశం సాయంత్రానికి పోస్ట్ పోన్ అయ్యింది.
నంద్యాల ఎరియల్ సర్వే సమయంలో కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ సమస్య రావడంపై సీఎంవో అధికారులు ఆరా తీశారు. సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా గుర్తించారు. ప్రొఫార్మా ప్రకారం ల్యాండింగ్ వివరాలు డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇస్తున్నారని తెలిసింది. ఇది అధికారుల నిర్లక్ష్యమే అని గుర్తించిన సీఎంవో విచారణ జరపాలంటూ కర్నూలు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్నూలు డీఆర్ఎం వెంకటేశ్వరన్ను విచారణ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్వేశాఖ డీఐ వేణుకు నోటీసులు కూడా జారీ చేశారు.