నేటినుంచి ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఏపీప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు వాడుకునేందుకు వీలుగా జీవో విడుదల చేస్తూ.. ఇవాళ్టి నుంచే ఈ సేవలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్లోని మెడ్కవర్ ఆసుపత్రుల డాక్టర్లు, అక్కడి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చికిత్స జరుగుతున్న తీరుతెన్నులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలని.. ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం అక్కడకు వచ్చారని.. వారికి సరైన చికిత్స అందించాలని అక్కడి వైద్యులను విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి.