వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరికొన్ని విప్లవాత్మక బిల్లులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏపీ లోకాయుక్త సవరణ బిల్లు, జీతాలు-ఫించన్ల చెల్లింపు-అనర్హుల తొలగింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ తదితర బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. సభలో ప్రవేశపెట్టిన పలు బిల్లులపై మాట్లాడిన సీఎం జగన్మోహన్రెడ్డి మార్కెట్ కమిటీలకు ఎమ్మెల్యేలను ఎందుకు గౌరవ అధ్యక్షులుగా నియమించాలనుకుంటున్నారో సభకు వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పరిధిలోని రైతుల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
శాసనసభలో మార్కెటింగ్ బిల్లు-2019పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇలా చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా లేదా అన్నది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సులభంగా తెలుస్తుందని, ఒకవేళ తమకు గిట్టుబాటు ధర రాకపోతే.. రైతులు మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేస్తారని, వారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకువస్తే.. ఆ విషయాన్ని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా, వివిధ వర్గాల ద్వారా తెలుసుకొని.. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోతే.. ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, రూ. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, ఆ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు.