మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. జగన్ అంచనాలు ఒకలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి స్పీడ్ను అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు అందుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం జగన్మోహన్రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. జగన్ స్పీడ్ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని వైసీపీ అధిష్టానం అంచనాకి వచ్చింది. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా తామేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ భావిస్తున్నారట. పథకాల సంగతి పక్కనబెడితే, అసలు విపక్షాల విమర్శలకు కూడా దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే ఇటీవల మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారట.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా మంత్రులు రిసీవ్ చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. ఒక్క సీఎం తప్పా మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదని, పరిపాలన మొత్తం జగన్ వన్మ్యాన్ ఆర్మీలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.