విశాఖపట్నంలో విషవాయువు లీక్.. రోడ్డుపైనే పడిపోతున్న జనం!
➡️ఎల్జీ పాలిమర్స్లో ఘటన ➡️ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక ➡️భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు
➡️ఎల్జీ పాలిమర్స్లో ఘటన
➡️ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక
➡️భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు
విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.
మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం బారిన పడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 200 మంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం.