ప్రతి కార్యకర్తకు.. అండగా ఉంటా

Update: 2019-07-03 15:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రజలను కలిసి వారి వినతులు స్వీకరించారు. అయితే చంద్రబాబును కలిసిన మహిళా కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ ఓటమి చెందిందని బోరున విలపించారు. వారిని ఓదార్చి అధైర్యపడవద్దని చంద్రబాబు భరోసా కల్పించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఆర్‌ అండ్ బీ అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పార్టీ ఓటమిపై చంద్రబాబు వద్ద భావోద్వేగానికి గురయ్యారు.

బోరున విలపిస్తున్న మహిళా కార్యకర్తలను చంద్రబాబు ఓదార్చారు. అధైర్యపడవద్దని కోరారు. ప్రజల సంక్షేమం కోసం పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. పార్టీ పూర్వవైభవం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. అనంతరం గుడుపల్లిలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో విభజన కష్టాలను పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని ప్రయత్నించామని చెప్పారు. టీడీపీ పాలనలో ఎవరిపైనా దాడులు చేయలేదన్నారు చంద్రబాబు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉండి కాపాడుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను ఓదార్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాడాలని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News