ఏపీకి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కల్లోల్ బిస్వాస్ను విధుల నుంచి తొలగించాలని.. కేంద్రం ఆదేశించింది. ప్రతిభా సమీక్ష పరీక్షల్లో విఫలమైన కల్లోల్ బిశ్వాస్కు.. 3 నెలల జీతం ఇచ్చి పంపించాలని స్పష్టం చేసింది. ఏపీ కేడర్ 1991 బ్యాచ్కు చెందిన కల్లోల్ బిశ్వాస్ ప్రస్తుతం విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రతిభా సమీక్ష పరీక్ష నిర్వహించింది. అయితే ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్క్యులర్ పంపింది.
కేంద్రం ఆదేశాల మేరకు ఆయనకు మూడు నెలల జీతం చెల్లించి విధుల నుంచి తప్పిస్తారు. ఏపీకి చెందిన ఒక కేంద్రప్రభుత్వ అధికారిపై ఇలా వేటు వేయడం ఇదే మొదటిసారి. బిస్వాస్ అనంతపురంలో పనిచేసినప్పుడు గాలి జనార్దనరెడ్డి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిస్వాస్ ను చాలాకాలం రిజర్వ్ లో ఉంచారు. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు రోజులకే వేటు పడింది.