Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్తను అందజేసింది. ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్తను అందజేసింది. ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశం అయ్యారు.
పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. ఎన్డబ్ల్యూడీఏ ద్వారా కాకుండా నాబార్డు నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలన్నారు. బుగ్గన ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై కేంద్రం ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.32 వేల కోట్లను కూడా కేంద్రం భరించనుంది.