కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇంటర్పోల్ అధికారులు సీఎం జగన్ను త్వరలో అదుపులోకి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇటీవల కొందరు వ్యాపారవేత్తలపై జరిగిన ఐటీ దాడులను వైసీపీ నేతలు టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ దాడులకు టీడీపీ సంబంధం ఏంటని ప్రశ్నించారు.
ఐటీ దాడులు జరిగిన వారికే సీఎం జగన్ పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిబట్టి చూస్తే ఐటీ దాడులకు ఎవరికి సంబంధం ఉందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అనవసర విషయాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఓ అరాచకవాది అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
రాష్ట్రంలో వైసీపీ ఆరాచకత్వం పెట్రేగిపోతుందని, వైసీపీ నేతలు పలు సంస్థల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చెస్తున్నారు. ఢిల్లీ పెద్దల కాళ్ల మీద పడుతున్నారని ఆరోపించారు. జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ జగన్ గతంలో పిటీషన్ వేశారని.. ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు జగన్ని నమ్మి మెజారిటీ కట్టబెట్టారని, ఇప్పటి వరకు ప్యాకేజీ విషయంలో కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.