జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసేది లాంగ్ మార్చ్ కాదని.. అది రాంగ్ మార్చ్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నదుల్లో నీళ్లు ఉంటే ఇసుక ఎలా తీస్తారని ఆయన ప్రశ్నించారు. పవన్ లాంగ్ ఎందుకు చేస్తున్నాడో.. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నాడో అందరికి తెలుసన్నారు మంత్రి. పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉన్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్లిపోయాడని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు,
పవన్లు కలిసి తెరవెనుక రాజకీయాలు చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని విమర్శించిన అవంతి.. పవన్కు కేడర్ లేనందువల్ల పవన్ను టీడీపీ అధ్యక్షుడిని చేస్తే బెటరని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే స్పందించలేదు.. ఇసుక దోపిడీకి పాల్పడిన వారిపై ఒక్క విమర్శ చేయకుండా.. ఇప్పుడు ఇసుక దొరకడం లేదని రోడ్డెక్కడం ఎందుకని ప్రశ్నించారు.