Jagan: సీఎం జగన్పై రాయితో దాడి.. కంటికి గాయం
Jagan: కంటి పైభాగాన బలంగా తాకిన రాయి
Jagan: ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న స్కూలు భవనం పై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు.
కాగా, క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు స్కూలు భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్డులో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైంది.
గాయపడ్డ సీఎం జగన్ను బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో యాత్ర ముగిసిన తర్వాత.. జగన్ సతీమణి భారతీ అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. జగన్ నుదుటికి రెండు కుట్లు పడ్డాయి. గాయం పెద్ద తీవ్రమైనది కాదని వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారని విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్ తెలిపారు.