AP Village Volunteer System: వాలంటీర్ సేవా వారధి... నేటికి సరిగ్గా ఏడాది.

AP Village Volunteer System: ప్రభుత్వ పథకం అందాలంటే ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ఏ చేతులు తడపాల్సిన అవసరమూ లేదు.

Update: 2020-08-16 08:49 GMT
AP Village volunteer system

AP Village Volunteer System: ప్రభుత్వ పథకం అందాలంటే ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ఏ చేతులు తడపాల్సిన అవసరమూ లేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందే వలంటీర్ల వ్యవస్థ. ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసి నేటికి ఏడాది కాలం పూర్తయింది.

ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.61 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. అస‌లూ వలంటీర్లు అవసరమా?' అని విమర్శించిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా వలంటీర్ల వ్యవస్థ అద్భుత విజయాన్ని అందుకుంది అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో.. పథకాల అమలులో పార‌ద‌ర్శ‌క‌త పెరిగింది.

లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లదే కీలకపాత్ర: 

జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన అన్ని పథకాలకు దాదాపు 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లదే కీలకపాత్ర. వివిధ పథకాల ద్వారా రూ.59 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని అందించారు. అర్హత ఉంటే పది రోజుల్లోనే పింఛన్, రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారు. వలంటీర్ల సేవలతో 10.52 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, రెండు లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. ఈ ఘ‌న‌త వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కే దాక్కుతుంది.

క‌రోనా క‌ష్ట‌కాలంలో వ‌లంటీర్ల కృషికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. కరోనా సోకినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంలో వలంటీర్ల ఎంత‌గానో కృషి చేశారు. ఈ త‌రుణంలో వలంటీర్‌‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు గ్రామ వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్‌ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. 'ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లబ్దిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా #APVillageWarriors కృషి పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చక్కగా పనిచేశారు' అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News