రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయ భవనాల్లో.. స్థలం సరిపోకపోవడంతో కొన్ని కార్యాలయాలను అక్కడి నుంచి తరలించినట్లు కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. అమరావతిలో స్థలం సరిపోకపోతే, వేరే భవనంలోకి మార్చే ప్రయత్నం చేయకుండా.. ఇతర ప్రాంతానికి ఎందుకు మార్చుతున్నాని ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. తీర్పును రిజర్వు చేసింది.
కాగా.. అమరావతి నుంచి కర్నూలుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను, మరో 10 విభాగాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించారు. అలాగే సచివాలయంతో సంబంధం లేని ఇతర కార్యాలయాల తరలింపు ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపింది. కార్యాలయాల తరలింపుపై ధర్మాసనం 'స్టే' ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ మంగళవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయ భవనాల్లో సరిపోయే అంత స్థలం లేకపోవడంతోనే కార్యాలయాలను తరలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కర్నూలులో భవనాలు ఉన్నాయని కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు, అందుకే కార్యాలయాలు తరలిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.