లోకల్‌కు బ్రేక్..వాట్ నెక్ట్స్?

Update: 2021-01-12 02:51 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్‌బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉదయం 11 గంటలకు విచారణ జరపనుంది హైకోర్టు. కరోనా వ్యాక్సిన్‌ వేసినా ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించే పరిస్థితిని హైకోర్టుకు వివరించారు ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదులు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ సహకరించలేదని డివిజన్‌ బెంచ్‌ ముందు వాదనలు విన్పించారు. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు, తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఎస్‌ఈసీ కోర్టు ముందుకు తీసుకురానుంది.

ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. తాజాగా ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ షెడ్యూల్‌ను నిలుపుదల చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు ఉన్నందున, అత్యవసర పిటిషన్‌గా భావించి విచారణ జరపాలని డివిజన్ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సరికాదని పేర్కొంది.

Tags:    

Similar News