కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఓవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తూనే, మరోపక్క లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటోంది. తాజాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది.
లాక్ డౌన్ నేపధ్యంలో వీరికి రూ. 5 వేల ఆర్ధిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బుని నేరుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలిపింది.. కాగా ప్రభుత్వం నుంచి జీతం అందుకునే వారికి మాత్రం దీనికి అర్హులు కారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాస్టర్లు,ఇమామ్ లు, పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.