ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తే కుదరదని పలు వార్త కంపెనీలను హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం. నిరాధార వార్తలు ప్రచురించే సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం జీవో 2430 ను తీసుకొచ్చింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కొన్ని మార్పులు చేసి ఈ కొత్త జీవోను గురువారం విడుదల చేశారు.
వైఎస్ హయాంలో ఈ జీవో విడుదల అయినప్పటికీ జర్నలిస్టుల ఒత్తిడితో అది అమలు కాలేదు. దాంతో ఆ జీవోలో సవరణలు చేసి మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ జీవో ఆధారంగా ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాసే ప్రతి వార్తకు ఆధారం ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. ఇకనుంచి ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా వార్తలు రాసి ప్రభుత్వం మీద బురద చల్లాలనుకుంటే చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
అయితే ఈ జీవో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపే పత్రికలను అణగదొక్కడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తోంది. అయితే తాము అసత్య కథనాలపై మాత్రమే చర్యలు తీసుకుంటామని.. వాస్తవాలు రాస్తే తమకేమి అభ్యంతరం లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విశేషం.