టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం- మంత్రి సురేశ్

AP 10th & Inter Exams: కరోనా పరిస్థితుల నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2021-05-27 13:36 GMT

Adimulapu Suresh (File Photo)

AP 10th & Inter Exams: కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. జూన్ 7న జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడం మాత్రం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్త షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

కేంద్ర స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షలతో పాటు, రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఈ మార్కులు అవసరమని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలల్లో వచ్చే మార్కులు విద్యార్థులకు చాలా అవసరమని మంత్రి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పరీక్షలను నిర్వహించాలని కోరుతున్నాయని ఆయ‌న చెప్పారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం విమర్శలు చేస్తున్నాయే తప్ప... విద్యార్థుల భవిష్యత్తుపై వాటికి శ్రద్ధ లేదని మండిపడ్డారు.

ప‌రీక్ష‌ల విష‌యంలో రాజ‌కీయాలు మాని విద్యార్థుల భ‌విష్య‌త్తు గురించి ఆలోచించాల‌ని అన్నారు. లోకేశ్ ఎం సాధించాల‌ని ప‌రీక్ష‌లు రద్దు చేయాల‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలు ఎంత రాద్ధాంతం చేసిన విద్యార్దుల కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, ప్ర‌స్తుతం క‌రోనా దృష్ట్యా ప‌రీక్ష‌లు వాయిదా వేశామని మంత్రి సురేశ్ స్ప‌ష్టం చేశారు.



Tags:    

Similar News