జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం బ్రిటిష్ ఇండియా చట్టం
కరోనా వైరస్ (కోవిడ్- 19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అధికారికంగా 81కి చేసింది.
కరోనా వైరస్ (కోవిడ్- 19) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అధికారికంగా 81కి చేసింది. అంతే కాకుండా దేశంలో కరోనా తొలి మరణం నమోదు చేసుకుంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా అనుమానిత వ్యక్తులకు నిర్బంధ వైద్య చికిత్స అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు.'ఎపిడమిక్ డిసీజెస్ చట్టం- 1897'ను అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ చట్టం ద్వారా కరోనా వైరస్ తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో ప్లేగు వ్యాధి నివారణకు 1897లో బ్రిటిష్ ఇండియా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇతర దేశాల నుంచి భారత్ వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు జవహర్ రెడ్డి ప్రకటించారు.
సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద సూచనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నెల్లూరులో కోవిడ్ 19 సోకిన వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని, అతని కరోనా నిర్థారణ అయ్యాక వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 55 శాంపిల్స్ పరీక్షలకు పంపించగా 47 మంది నెగటివ్గా వచ్చాయన్నారు. మరో 8 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పారు.
తిరుపతి స్విమ్స్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే కరోనా ల్యాబ్ అందుబాటులోకి రానుందని జవహర్రెడ్డి వెల్లడించారు. రైల్వే, ఎయిర్ పోర్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.