రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. రేపు సాయంత్రం అమిత్షాతో జగన్ భేటీకానున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. అయితే రేపు మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు.