సెప్టెంబర్ 1 నుంచి నేరుగా అర్హుల ఇంటికే పెన్షన్ వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు వచ్చిన జగన్ జమ్మలమడుగులో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..''సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు.