వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలని అధికారులను ఆదేశించారు. కనీసం ఆరు ఏళ్లకు ఒకసారి వాహనాలను మార్చాలన్నారు. వేయి వాహనాలను ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నామని కొత్త వాహనాలకు సెప్టెంబర్లో టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు, క్యు ఆర్ కోడ్తో కార్డుల జారీ చేయాలన్నారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని.. ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంటాయని సీఎం చెప్పారు. కార్డు స్కాన్ చేయగానే కార్డుదారునికి ఓటీపీ వస్తుందని డిసెంబర్ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభించాలని నిర్ణయించారు. 5లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దానికి కిందకు వచ్చే జబ్బుల జాబితాను కూడా తయారు చేయాలి' అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.