Kakinada Port: కాకినాడ పోర్టు కేంద్రంగా స్మగ్లింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్
AP Minister Nadendla Manohar press meet about PDS rice smuggling at Kakinada Port: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ఐదేళ్లుగా ఒక స్మగ్లింగ్ మాఫియా దేశ భద్రతను కూడా లెక్క చేయకుండా తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేశారో అది కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఏపీలో కోటి 48 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ కోసం సుమారు రూ. 12,800 కోట్ల వెచ్చించి మరీ బియ్యం, ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. కానీ ఆ రేషన్ బియ్యాన్ని గత ఐదేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల ఆరోపించారు.
ఈ సంద్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నాక ఈ స్మగ్లింగ్ దందా బయటపెట్టేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ముందుగా తెనాలిలో పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టాం. అందులో అనేక అవకతవకలు గుర్తించాం. జూన్ 28న కాకినాడలో 13 గోడౌన్లలో తనిఖీలు జరిపాం. 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 25,386 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల శాఖ పంపిణి చేసే రేషన్ బియ్యమేనని గుర్తించడం జరిగిందన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతోందని మంత్రి తెలిపారు.
గత ఐదేళ్లుగా కాకినాడ పోర్టు లోపలికి ఎవ్వరినీ అనుమతించకుండా స్మగ్లింగ్ చేశారు అని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా నొక్కేయడం, లేదా ఇచ్చిన చోట రూ. 10 కే మళ్లీ కొనుగోలు చేసి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని సేకరించి బయటికి ఎక్స్పోర్ట్ చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.