ఏపీ అసెంబ్లీని పోలవరం అంశం కుదిపేసింది. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలంటూ టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై సాగు నీటి శాఖ మంత్రి సమాధానమిచ్చారు. అయితే మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు . పోడియం దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరంపై ప్రతి రోజు ప్రశ్నలు అడగటం సభా కార్యకలాపాలను అడ్డుకోవడం రివాజుగా మారిందని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు .