ఈనెల 20న ప్రత్యేక సమావేశం.. అసెంబ్లీ అధికారులకు సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శాసన ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శాసన ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసన సభ ప్రత్యేక సమావేశం ఈనెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే శాసన మండలి 21న సమావేశం కానుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ అధికారులకు పంపించింది.
కాగా ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా హై పవర్ కమిటీ ఇవాళ కూడా సమావేశం అయింది. ఈ సందర్బంగా జిల్లాల వారీగా అభివృద్ధిపై చర్చించింది. అలాగే రాజధాని రైతులకు ఎటువంటి న్యాయం చెయ్యాలనేదానిపై కూడా చర్చ జరిగింది. రాజధాని తరలింపు అనివార్యం అయితే ఉద్యోగుల తరలింపు ఎలా అనే అంశాన్నీ పరిశీలించి ఒక నివేదిక తయారు చేసింది. ఈ నెల 17న తుది హై పవర్ కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతులు తమ సూచనలను ఈనెల 15 సాయంత్రం లోపు సీఆర్డీఏకు పంపించాలని పేర్నినాని సూచించారు.