ఆక్వా రంగం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు
దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సూచించారు.
దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సూచించారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. అమరావతితో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల నుంచి ఏప్రిల్ 14 లాక్ డౌన్ కొనసాగుతుందని, అప్పటి వరకు ఆక్వా ఆక్వా ఉత్పత్తుల ధరలు, నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూ వివరించారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోందని, మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులకు నాణ్యత విషయంలో మంచి పేరుందని మంత్రి తెలిపారు.
కరోనా ప్రభావంతో ఆక్వా , పౌల్ట్రీ రంగాలు కొంత ఇబ్బందులకు గురి అవుతున్నాయని అన్నారు. కోవిడ్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయనేది వాస్తవం కాదని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ,అనుబంధ రంగాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తూన్నారని తెలిపారు. ఈ ఆక్వా సాగుకు ఏప్రిల్, మే, జూన్ నెలలు చాలా కీలకమైనవి, ఈ నేపథ్యంలో ఆక్వా రంగం దెబ్బతినకూడదని సీఎం తీసుకుంటున్నారని మంత్రి మోపిదేవి వెల్లడించారు.
అందులో భాగంగానే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులతో చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. ఆక్వా ఎగుమతిదారులు పలు సూచనలు స్వీకరించామన్నారు. 90 శాతం ఆక్వా ఉత్పత్తులు చైనా, అమెరికా, యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామన్నారు. 30 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. 30 కౌంట్ కేజీ ధర 430 రూపాయలు కాగా, 40 కౌంట్ ధర 310, రూపాయలు, 50 కౌంట్ ధర రూ.260, పలు రకాల ధరలు నిర్ణయించామన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల కోసం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆక్వా ఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
హడావిడిగా సాగుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవద్దని రైతులను అభ్యర్థించారు. ఆక్వాకు సంబంధించిన ఉత్పత్తులు సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్య తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగుమతులు ఆగడానికి వీలులేదన్నారు. 5,6 రోజులుగా ఇదే విషయమై జిల్లా యంత్రాంగం, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరిపుతున్నామన్నారు. కరోనాతో సంబంధం లేకుండా రైతు పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇది స్వాగతించాల్సిన అంశమని కొనియాడారు.