AP Krishna River Board Letter: మిగుల నీటి వినియోగంపై క్లారీటీ ఇవ్వండి.. కేంద్రంకు ఏపీ కృష్ణా బోర్డు లేఖ

AP Krishna Board Letter: వాటాల ప్రకారం కృష్ణా నదీ జలాల్లో నీటి వినియోగానికి సంబంధించి వివాదం నడుస్తోంది.

Update: 2020-08-15 03:21 GMT
AP Krishna River Board Letter to Central

AP Krishna Board Letter: వాటాల ప్రకారం కృష్ణా నదీ జలాల్లో నీటి వినియోగానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ప్రతి ఏటా వినియోగానికి కేటాయించిన నీటిని ఆ సమయంలో వాడుకోకుండా, మరుసటి సంవత్సరం కేటాయించాలంటూ చేస్తున్న డిమాండ్ పై సందిగ్ధత నెలకొంది. దీనిపై స్పష్టత వస్తే ఈ వివాదం దాదాపుగా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్న కృష్ణా బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. ఇది ఒక స్పష్టతకు వస్తే మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలియజేసింది.

కృష్ణా నదీ జలాల్లో గతేడాది వాటా నీటిలో వినియోగించుకోకుండా మిగిలిన వాటిని తర్వాతి సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అనే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కృష్ణా బోర్డు కోరింది. గతేడాది వినియోగించుకోని వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం నీటి లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని.. వినియోగించుకోని నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని తేల్చిచెప్పింది. ఈ నీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలసంఘానికి పంపించి, వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని విజ్ఞప్తి చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు.

లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

► 2019–20 నీటి ఏడాదిలో ఏపీ 651.99 టీఎంసీలకు గానూ 647.43 టీఎంసీలు వినియోగించుకుంది. తెలంగాణ 333.52 టీఎంసీల వాటాకు278.33 టీఎంసీలు ఉపయోగించుకుంది.

► గత నీటి సంవత్సరంలో వాటాలో 50 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోలేదని, ఆ నీటిని 2020–21లో ఉపయోగించుకుంటామని తెలంగాణ ప్రతిపాదించింది.

► కానీ, దానిని ఏపీ తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అక్కడితోనే ముగుస్తాయని.. వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని స్పష్టంచేసింది.

► దీంతో ఈ వివాదంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చాం. ఈ కమిటీ భేటీలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ అంశంపై విధివిధానాలు ఖరారుచేసే బాధ్యతను కేంద్ర

జలసంఘానికి అప్పగించి వీలైనంత తొందరగా తేల్చాలి.

Tags:    

Similar News