AP MLC Election Notification: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

AP MLC Election Notification: ఏపీలో మరోసారి చిన్నస్థాయి ఎన్నికల హడావిడి ఉంటుంది.

Update: 2020-08-07 01:30 GMT
Andhra Pradesh Legislative Council (File Photo)

AP MLC Election Notification: ఏపీలో మరోసారి చిన్నస్థాయి ఎన్నికల హడావిడి ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున సాధారణంగా ముగిసే అవకాశం ఉంది. దీనికి సంబందించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగస్ట్‌ 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌ రాజ్యసభకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే వీరిద్దరూ రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆరునెలల లోపు గడువు మాత్రమే ఉన్న స్ధానాలకు సహజంగా ఉప ఎన్నికలు నిర్వహించరు. దీంతో మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే ఈసీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఎలాగో ఆరు నెలల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన స్ధానం గడువు పూర్తయ్యాక ఒకేసారి ఈ ఎన్నిక నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ రెండు స్ధానాలు ఎమ్మెల్యే కోటా స్ధానాలే కావడం, రాజీనామాలు చేసిన వారు కూడా వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ రెండు స్ధానాలూ ఎలాగో వైసీపీ ఖాతాలోకే చేరతాయి. అంతే కాదు ఇప్పటికే ఖాళీ అయిన స్ధానాలతో పాటు రాబోయే ఎమ్మెల్యే కోటా ఖాళీలను కూడా వైసీపీ అనాయాసంగా తమ ఖాతాలోకి వేసుకోనుంది.

Tags:    

Similar News