కడప స్టీల్ కోసం రూ. 500 కోట్లు కేటాయింపు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Update: 2020-06-16 03:32 GMT

జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది పూర్తికావడంతో అంతటా అనందం నెలకొంది. ఇప్పటివరకు ప్రజల వ్యక్తిగత లబ్దికి సంబంధించి పలు పథకాలను అమలు చేసిన ఏపీ సర్కార్ సామాజిక అవసరాలపై చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కడప స్టీల్ ఏర్పాటుకు సంబంధించి రూ. 500 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీలైనంత తొందర్లో దీనిని పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ. 500 కోట్లు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తుండగా.. వాటితో అధికారులు చర్చలు జరిపారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామంటూ అధికారులు సీఎంకు పూర్తి వివరాలను తెలిపారు.

ఆయా సంస్థలతో మరోసారి చర్చలు జరపాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం కుదుర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని, నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్‌, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచనలు ఇచ్చారు.


Tags:    

Similar News