దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ఎంతో ఉపయుక్తం అని భావిస్తున్న కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ను ఈ నెల 31 వరకు అమలు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సడలింపులతో కూడిన నూతన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. అటు ప్రైవేటు బస్సులకు కూడా అనుమతివ్వాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. బస్సు సర్వీసులు నడిపేందుకు విధి విధానాలు తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇదిలా ఉంటే కరోనా నేపధ్యంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో కోవిడ్–19పై సీఎం వైయస్ జగన్ చర్చ జరుపుతున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. అంతరాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలనే విషయమై చర్చ జరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చేవారికి బస్సులు నడపడంపై దృష్టిసారిస్తున్నారు. వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం. మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశముంది.