YS Jagan: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచితంగా మాస్కులు పంపిణీ..
ఏపీలో ప్రతి ఒక్కరికీ మాస్క్లు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఏపీలో ప్రతి ఒక్కరికీ మాస్క్లు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కరికీ మూడు మాస్కులు చొప్పున రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల మందికి, 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం ఆదేశించారు. మాస్క్ల వల్ల కొంత రక్షణ లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం. వీలైనంత త్వరగా మాస్కులు పంపిణీచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మరోవైపు కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో పరిధిలో 45వేల పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి జోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు 32,348 మందిని వైద్యాధికారులకు రిఫర్చేశారు. వారిలో 9,108 మందికి పరీక్షలు అవసరమని మెడికల్ ఆఫీసర్లు ధ్రవికరించారు. అయితే, మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ లాంటి వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించాలన్నారు.
అలాగే నమోదవుతున్న కేసులు దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు సమాచారంఇవ్వాలన్నారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా... ఉండాల్సిందేనన్న సీఎం ఎక్కడా కూడా జనం గమిగూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైనా కరోనా పాజిటివ్ కేసులు 417 కాగా.. విదేశాలనుంచి వచ్చిన వారిలో 13 పాజిటివ్ కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకిన కేసుల 12 కాగా.. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో 199 పాజిటివ్ కేసులు . వారిద్వారా 161 కరోనా సోకింది. వ్యాధి సోకిన వారు, ఇతర మార్గాల 32 మందికి కరోనా సోకిన వారు ఉన్నారు.