వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారు..డిస్ క్వాలిఫై చేయాలి.. ఈసీకి కన్నా ఫిర్యాదు
ఏపీలో కరోనా సాయం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.1000ని వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారని ఎస్ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సాయం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.1000ని వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారని ఎస్ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.ఈ మేరకు లేఖ రాశారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజలను మభ్యపెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం చేసే సాయాన్ని వైసీపీ నాయలకులు ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.1000 పంపిణీ చేస్తోంది. వాస్తవానికి గ్రామ వాలంటీర్ల ద్వారా ఆ నగదు పంపిణీ చేయాల్సి ఉన్నా, వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం వారే పంపిణీ చేస్తున్నారని కన్నా ఆరోపించారు.
వైసీపీ నేతలు నగదు పంపిణీ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని బహిరంగంగా అభ్యర్థిస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. చట్టాన్ని ఉపయోగించి వారిని డబ్బులు పంపిణీ చేసిన వారిని డిస్ క్వాలిఫై చేసి జైలుకు పంపాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న సాయంలో కూడా అధికార పార్టీ నేతలు రూపాయలు తగ్గించి ఇస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయనే విషయాన్ని కన్నా ఎన్నికల సంగం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం పూర్తిగా పేదలకు చేరకపోవడం మరింత బాధాకరమైన విషయమని అన్నారు.
అదే సమయంలో పేదల వద్దకు వేళ్లేవారు మాస్క్లు దరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సాయం విషయంలో వైసీపీ నేతలేవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని ఎస్ఈసీ రమేష్ కుమార్ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు.