ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ సభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ సభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చిలో ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కాగా, 16 నాటి సమావేశంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై..ఎన్ని రోజులపాటు సమావేశాలను నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.
ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు శాసనసభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 18న ఆర్థికశాఖ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను సాధ్యమైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాలు అంటున్నాయి.