పశువులకూ ఆధార్ తరహా కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వబోతోంది. 12 అంకెల సంఖ్యగలిన వాటితో పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్ వేయనున్నారు. దీంతో భవిష్యత్లో ఈ ట్యాగ్ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఈ ట్యాగ్ లేనివి ప్రమాదంలో చనిపోయినా.. రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరు. రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న రూ.1000 కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది.
ఇవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఇనాఫ్ ట్యాగ్ (ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్)ను వేయనున్నారు. చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్తోపాటు ఇనాఫ్ ట్యాగ్ను వేయనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నట్లు గుర్తించారు.
కాగా.. రెండు నెలల కాల వ్యవధిలో పశువులకూ వాక్సిన్తోపాటు ట్యాగ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్ ట్యాగ్లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు.