ఆంధ్రప్రదేశ్లో సంపూర్థ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తెస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు, మరో కీలక అడుగు వేసింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మద్యం అమ్మకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో 535 మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ తగ్గించింది.
నేటి నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2965కి తగ్గనుంది. కాగా.. గతంలో మొత్తం 4,380 మద్యం షాపులు ఉండగా.. గత ఏడాది ఆగస్టులో వాటిని 3,500కి తగ్గించింది. తాజాగా ఈ షాపుల సంఖ్యను 2,965కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 20 శాతం, ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో మొత్తం 33శాతం తగ్గించినట్లైంది.