యూపీః గుండెపోటుతో కోతులు చనిపోవడమేంటని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి. ఉత్తరప్రదేశ్లోని కొత్వాలీ మహమ్మాది ప్రాంతంలో 12 కోతులు ఒకేచోట చనిపోయి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఏ క్రూరమృగం వాటిని గాయపరచలేదు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. కానీ కోతులన్నీ ఒకేచోట శవాలుగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై వెటర్నరీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పులి ఆ ప్రాంతంలో పదేపదే సంచరిస్తున్న దృశ్యాలను కోతులు చూడటం, పులి గాండ్రింపులను పదేపదే వినడం వల్ల గానీ గుండెపోటు సంభవించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.
అడవిలో అన్ని జీవులు ఉంటాయని, పులుల అరుపులు వినడం ఆ కోతులకు కొత్తేమీ కాదని చెబుతున్నారు. ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి కోతులు చనిపోయి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కారణం ఏంటో తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు. డాక్టర్ బ్రిజేంద్ర సింగ్ కూడా అటవీ శాఖ అధికారుల వాదననే సమర్థించారు. కోతులు కూడా వన్యప్రాణులేనని, పులి గాండ్రిపులకు భయపడి కోతులు చనిపోతాయనడం పూర్తిగా అసంబద్ధమన్నారు.