Banganapalli Mango Price Hiked : బంగారంగా.. బంగినపల్లి మామిడి

Arun Chilukuri
Published on: 25 July 2020 5:17 PM IST
Banganapalli Mango Price Hiked : బంగారంగా.. బంగినపల్లి మామిడి
X

Banganapalli mango price hiked : బంగినపల్లి మామిడి బంగారంగా మారింది. ఉలవపాడు తోటల్లో ఆఖరి పూతకు వచ్చిన కాయలు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడు లేనంత ధర పలకడంతో రైతుల కష్టానికి ఫలితం దక్కినట్లయ్యింది. కానీ కొందరు రైతులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కాత ఉన్నప్పుడు ధర లేదు. ధర ఉన్నప్పుడు కాత లేదని ఆవేదన చెందుతున్నారు.

పండ్లకే మహారాజైన మామిడి నిజంగానే రైతులను మహారాజులను చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా టన్ను మామిడికి లక్ష పలకడంతో రైతుల ఇంటా సంతోషం వెల్లివిరుస్తోంది. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధరలు అంతంత మాత్రమే పలికాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం పంట చివరి దశలోకి రావడం ఒకేసారి జరిగాయి. వ్యాపారులు పోటీ పడడంతో మామిడి ధరలకు రెక్కలచ్చాయి.

ప్రకాశం జిల్లా ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని 7వేల హెక్టర్లలో రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు. హెక్టర్‌కు 10 టన్నుల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కొందరు రైతులు పూత దశలోనే తోటలను వ్యాపారులకు అమ్మేశారు. కరోనా ప్రభావంతో బయట ప్రాంతాలకు ఎగుమతులు లేకపోవడంతో మరికొందరు మామిడి పంటలను తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగించారు. ఈ ఏడాది పంట ప్రారంభదశలో టన్ను బంగినపల్లి మామిడి ధర 30 వేల నుంచి 35 వేల వరకు పలికింది. కరోనా సడలింపుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల వ్యాపారులు ఉలవపాడు ప్రాంతానికి ఆలస్యంగా చేరుకోవడంతో బంగినపల్లి మామిడి ధర అమాంతం పెరిగింది. టన్ను ధర 50 వేల నుంచి 80 వేలకు చేరుకుంది. మామిడి పంట చివరి దశకు వచ్చేసరికి లక్ష నుంచి లక్షా 20 వేల వరకు చేరింది. వ్యాపారులకు ముందే తోటలను అమ్ముకోవడం ఇప్పుడు రైతుల పాలిట శాపంలా మారింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వ్యాపారులు పోటీ పడడంతో పంట చివరి దశలో అమ్ముకున్న రైతులకు మామడి బంగారంగా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story