Khammam: కన్నకొడుకును ముద్దాడుతూనే కన్నుమూసిన తల్లి

Khammam: ప్రస్తుత కాలంలో 'సైలెంట్ కిల్లర్'గా మారిన గుండెపోటు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

Arun Chilukuri
Published on: 23 March 2026 3:28 PM IST
Khammam
X

Khammam: కన్నకొడుకును ముద్దాడుతూనే కన్నుమూసిన తల్లి

Khammam: ప్రస్తుత కాలంలో 'సైలెంట్ కిల్లర్'గా మారిన గుండెపోటు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ మాయదారి రోగం, నేడు చిన్న వయసు వారిని కూడా వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ కలచివేస్తోంది. కళ్లముందే ఆడుకుంటున్న కన్న కొడుకును ముద్దాడుతూనే ఓ తల్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన సుష్మకు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్యా సందీప్‌తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే సుష్మ తన పిల్లలతో కలిసి నాయుడుపేటలోని పుట్టింటికి వచ్చింది.

ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున సుష్మ తన మూడేళ్ల చిన్న కుమారుడితో సరదాగా గడుపుతోంది. బాబును ముద్దాడుతున్న సమయంలోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. అప్పటివరకు ఆనందంగా గడిపిన తల్లి విగతజీవిగా మారడంతో ఆ పసిపిల్లల రోదనలు మిన్నంటాయి.

ఈ ఘటన మరోసారి యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పుపై ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి కారణంగానే చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెలో అసౌకర్యం, ఆయాసం, చెమటలు పట్టడం వంటి చిన్నపాటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.

క్రమబద్ధమైన వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story