Danam Nagender: స్పీకర్ తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: తనపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు.
Danam Nagender: స్పీకర్ తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: తనపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ మరియు బీజేపీ అగ్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలు:
ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కొందరు భ్రమిస్తున్నారని దానం వ్యాఖ్యానించారు. "కేసీఆర్ గారికి పదవి పోయిందని ఇబ్బంది లేదు కానీ, కేటీఆర్కు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఏంటని కొందరు మదనపడుతున్నారు" అంటూ ఎద్దేవా చేశారు. ఎంత డీ-మోరల్ చేయాలని చూసినా సీఎం తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే:
తాను ఎంపీగా ఓడిపోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయికే కారణమని దానం ఆరోపించారు. "నాతో బీజేపీకి ఏం సంబంధం? నాపై వారు ఎందుకు ఫిర్యాదు చేశారు? అంటే ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థమవుతోంది. నేను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీలే ఉండేవి కావు" అని పేర్కొన్నారు.
అనర్హత పిటిషన్లపై ధ్వజం:
రెండు నాల్కల ధోరణి: గతంలో సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు బీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన మంత్రి పదవులు ఇచ్చిందని దానం ప్రశ్నించారు. "వారికో న్యాయం.. నాకో న్యాయమా?" అని నిలదీశారు.
సభ్యత్వం తీసుకోలేదు: తాను ఎక్కడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా పని చేయలేదని వివరించారు.
కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?: నాపై పిటిషన్ వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికలకైనా సిద్ధం:
తానొక యుద్ధ రంగం నుండి వచ్చిన వాడినని, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వచ్చినా ఉప ఎన్నికల్లో నిలబడి మళ్ళీ గెలిచే వాడినని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఆశించినట్టే ఫలితాలు వస్తాయని, తాను ఎప్పటికీ ఖైరతాబాద్ ప్రజల సైనికుడినేనని దానం నాగేందర్ స్పష్టం చేశారు.




