Kavitha: కవిత సంచలనం కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు.. 'డాడీ, మోడీ' లపై యుద్ధం!
Kavitha: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. డాడీ, మోడీ, చిన్న మోడీలపైనే నా పోరాటం అని స్పష్టం చేశారు.
Kavitha: కవిత సంచలనం కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు.. 'డాడీ, మోడీ' లపై యుద్ధం!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోంది. బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటికే పార్టీ అజెండాపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఎవరితోనూ రాజీ లేదు.. ముగ్గురిపైనే నా పోరాటం!
ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. "నా పోరాటం డాడీ (కేసీఆర్), మోడీ, మరియు చిన్న మోడీ (రేవంత్ రెడ్డి) లపైనే ఉంటుంది. ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదు" అని ఆమె తేల్చి చెప్పారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని, యువతకు పెద్దపీట వేస్తూ కొత్త పార్టీని విజయవంతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తీరుపై ధ్వజం
బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న విభేదాలను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా (అడ్వాంటేజ్) మార్చుకుంటున్నారని కవిత విమర్శించారు. అసెంబ్లీలో సైతం తన ఇష్యూను వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
శ్రీరామనవమి తర్వాత ప్రకటన
నూతన పార్టీ కార్యాలయం కోసం ఇప్పటికే స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు కవిత తెలిపారు. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని, అంతకంటే ముందే తనకున్న పరిచయాలతో జాతీయ స్థాయి నేతలను కలిసి మద్దతు కోరతానని వెల్లడించారు.
వనపర్తి నుంచి పోటీకి వినతులు
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తనను పోటీ చేయాలని కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత్త పార్టీ ప్రభావం బలంగా ఉంటుందని, ఇటీవలే వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని ఆమె వెల్లడించారు.




