Hyderabad: కళ్లలో కారం కొట్టి రూ. కోటి హవాలా నగదు అపహరణ!
Hyderabad: భాగ్యనగరంలో హవాలా డబ్బు కలకలం రేపింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు బరితెగించి, పట్టపగలే బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా ఒక కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు.
Hyderabad: కళ్లలో కారం కొట్టి రూ. కోటి హవాలా నగదు అపహరణ!
హైదరాబాద్ (కూకట్పల్లి): భాగ్యనగరంలో హవాలా డబ్బు కలకలం రేపింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు బరితెగించి, పట్టపగలే బాధితుల కళ్లలో కారం కొట్టి ఏకంగా ఒక కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. ఏసీపి కార్యాలయ సమీపంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా సంచలనంగా మారింది.
ఘటన వివరాలు:
పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్పురాకు చెందిన అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై కాటన్ బాక్సుల్లో పెద్ద మొత్తంలో నగదును తరలిస్తున్నారు. బహదూర్పురా నుండి జీడిమెట్ల వైపు వెళ్తుండగా, డబ్బు మార్పిడి కోసం కూకట్పల్లి ఏసీపి ఆఫీసు సమీపంలో ఆగారు. సరిగ్గా అదే సమయంలో మాటు వేసిన దుండగులు, బాధితులపై ఒక్కసారిగా దాడి చేసి వారి కళ్లలో కారం కొట్టారు. అనంతరం బైక్పై ఉన్న కోటి రూపాయల నగదుతో పరారయ్యారు.
రంగంలోకి పోలీసులు:
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ నగదు అంతా హవాలా సొమ్ముగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితులు బాధితులను వెంబడించి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికి చేరవేయాలి? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.




