Suryakumar Yadav: ధోనీ, రోహిత్ సూపర్.. అమ్మో విరాట్ భాయ్.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Suryakumar Yadav: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వ శైలిపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి కెప్టెన్ ప్రత్యేకత, వారి నాయకత్వంలో వచ్చిన మార్పులు టీమిండియా విజయాలకు పునాది అయ్యాయని పేర్కొన్నాడు.

Rishvik
Published on: 22 March 2026 7:47 PM IST
Suryakumar Yadav
X

Suryakumar Yadav: ధోనీ, రోహిత్ సూపర్.. అమ్మో విరాట్ భాయ్.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ముగ్గురూ భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు. ధోనీ (3 ఐసీసీ ట్రోఫీలు) కూల్ కెప్టెన్సీకి, విరాట్ (టెస్టుల్లో అత్యధిక విజయాలు) దూకుడుకు, రోహిత్ (టీ20 వరల్డ్ కప్) అటాకింగ్ శైలి-వ్యూహాలకు ప్రసిద్ధి. ధోనీ వ్యూహాత్మక ఆలోచనలు, విరాట్ ఫిట్‌నెస్-దూకుడుకు, రోహిత్ ప్రశాంతత వేర్వేరు సమయాల్లో భారత జట్టుకు విజయాలను అందించాయి. ఈ ముగ్గురి కెప్టెన్సీపై చాలా మంది ఇప్పటికే స్పందించారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్‌లో ముగ్గురు దిగ్గజ కెప్టెన్లకు పోలికలు చెప్పాడు.

ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వ శైలిపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి కెప్టెన్ ప్రత్యేకత, వారి నాయకత్వంలో వచ్చిన మార్పులు టీమిండియా విజయాలకు పునాది అయ్యాయని పేర్కొన్నాడు. ముందుగా ధోనీ గురించి మాట్లాడుతూ.. 'మాహీ భాయ్ చాలా కూల్, కామ్, కంపోజ్డ్ నేచర్‌తో జట్టును నడిపించాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ఆయన శైలి జట్టుకు ఎంతో ఉపయోగపడింది' అని సూర్యకుమార్ చెప్పాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ... 'విరాట్ భాయ్ పూర్తిగా అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో జట్టును ముందుకు నడిపించాడు. ఏ దేశానికైనా వెళ్లి గెలవాలనే తపన, ఫిట్‌నెస్‌పై దృష్టి, పరుగుల విషయంలో కొత్త ప్రమాణాలను సృష్టించాడు. విరాట్ నాయకత్వం టీమిండియాలో కొత్త మార్పులకు దారి తీసింది' అని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. రోహిత్ శర్మ నాయకత్వంపై మాట్లాడుతూ.. 'రోహిత్ భాయ్ చాలా రిలాక్స్‌డ్‌గా ఉండే కెప్టెన్. ఎలా పని చేయించాలి, ఎప్పుడు చేయించాలి అన్నది ఆయనకు బాగా తెలుసు. గ్రౌండ్‌లో ప్రతి ఆటగాడితో మాట్లాడటం, ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనడం, ఆటగాళ్లతో సమయం గడపడం వంటి విషయాలు రోహిత్ ప్రత్యేకత' అని సూర్య వివరించాడు.

ముగ్గురు దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ తమ శైలిలో టీమిండియాను ముందుకు నడిపించారని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న విజయాలకు వారి నాయకత్వమే పునాది అని సూర్య స్పష్టం చేశారు. ప్రస్తుతం అందరూ ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నారు. ఆశ్చర్యకరంగా అందరూ ఇప్పుడు ఆటగాళ్లగానే ఆడుతున్నారు. ఎవరూ కూడా సారథులుగా లేరు. ఐపీఎల్ 2026లో ఈ నలుగురు ఎలా ఆడుతారో చూడాలి.

Rishvik

Rishvik

Next Story